సిబ్బంది నిర్లక్ష్యంతో ఎండిపోయిన 500 హరితహారం మొక్కలు

by Dishafeatures2 |
సిబ్బంది నిర్లక్ష్యంతో ఎండిపోయిన 500 హరితహారం  మొక్కలు
X

దిశ, గాంధారి: పట్టించుకునే నాధుడు లేక నర్సరీ ఎండిపోతోంది. దీంతో లక్షల రూపాయల ప్రజాధనం మట్టిపాలు అవుతోంది. ఇంత జరుగుతున్నా సర్పంచ్, ఇతర గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టించుకోక పోవడం విమర్శలకు తావిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుర్జాల తండాలోని నర్సరీలో నీళ్లు పెట్టేవాళ్లు లేక చెట్లన్నీ ఎండిపోయాయి. ప్లాస్టిక్ కవర్ అందులో మట్టి తప్ప మొక్కలన్నీ ఎండిపోయాయి. గుర్జాల్ పంచాయతీ సెక్రటరీ ప్రకాశ్ లెక్కల ప్రకారం ఈ నర్సరీలో మొత్తం 500 వరకు టేకు, జామ, నిమ్మ, దానిమ్మ మొక్కలు పెట్టారు. వీటిని వైకుంఠధామంలో పెట్టేందుకే పెంచుతున్నారు. కానీ పట్టించుకేనే వాళ్లు లేక ఈ మొక్కలన్నీ ఎండిపోయి ఖాళీ ప్లాస్టిక్ సంచులే దర్శనమిస్తున్నాయి. ఈ విషయమై సదరు సెక్రటరీని వివరణ కోరగా.. తనకేమీ తెలియదని, సర్పంచ్ చెప్పినట్లుగా నడుచుకుంటున్నానని చెప్పాడు. కావాలంటే కారోబార్ ను అడగాలని తెలిపాడు.


ఇక కలెక్టరో లేదా ఎమ్మెల్యే వస్తే పెద్ద హడావుడి చేసే స్థానిక సర్పంచ్.. నర్సరీలో మొక్కలు ఎండిపోయినా ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఆ మొక్కలను తమ ఇళ్లల్లో పెంచుకుంటామని గ్రామస్థులు అడిగినా సర్పంచ్ ఇవ్వలేదని, అలా ఇచ్చినట్లైతే కనీసం సగం మొక్కలైనా బతికుండేవని వారు చెబుతున్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్, సెక్రటరీ నిర్లక్ష్యం వల్లే మొక్కలన్నీ ఎండిపోయాయని, ప్రజా ధనాన్ని వృధా చేసిన సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తు్న్నారు.

Also Read....

పారిశుధ్య లోపం.. పబ్బతి ఆంజనేయ స్వామికి శాపం

Next Story